రెవెన్యూ చట్టంతో పేద, మధ్య తరగతి సహా ప్రజలందరీ ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించే దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. దీంతో పేద, మధ్య తరగతి సహా ప్రజలందరీ ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. ప్రజల యొక్క దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. భూ వివాదాలు, ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్ లు.. తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్ చేయించుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. ఇకముందు ఒక ఇంచు భూమి ఒకరి పేరు నుండి మరొకరి పేరుమీదకి బదిలీ కావాలంటే ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ జరుగుతుందని తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు.. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి నెంబర్ తీసుకుని.. ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు. ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం వుందని హెచ్చరించారు.
అటు నిరుపేద ప్రజలు ఎన్నో ఏండ్లుగా వుంటున్న ఇండ్ల స్థలాలను.. పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా.. ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ ఆస్తుల మ్యుటేషన్ కు, ఎల్.ఆర్.ఎస్ కు ఏలాంటి సంబంధం లేదని సీఎం స్పష్టం చేశారు. ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతిరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ భూముల పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో నిర్మించుకున్న ఇండ్లు.. తదితర ఆస్తులను ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సిఎం తెలిపారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో.. ప్రజలకు సర్పంచులు, ఎంపిటీసిలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని సీఎం సూచించారు. ఎంపీఓలు దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్వవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్ టిఎల్, నాలా, యు ఎల్ సి పరిధిలో నిర్మించుకున్న ఇండ్లకు ఈ మ్యుటేషన్ వర్తించదని తేల్చిచెప్పారు. భవిష్యత్ లో ఆస్తుల నమోదు ప్రక్రియను కానీ రెగ్యులరైజేషను కానీ ఉచిత నాలా కన్వర్షన్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని ఇదే చివరి అవకాశమని సిఎం తెలిపారు.
వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్ లైన్ నమోదు ప్రక్రయతో పాటు.. ప్రజలకు ప్రభుత్వం మెరూన్ కలర్ పాస్ పుస్తకాలు అందించే విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు సీఎం కేసీఆర్. ఆస్తుల వివరాలు ఆన్ లైన్ నమోదులో కూడా అధికారులు, సిబ్బందితో పర్యవేక్షించాలని సిఎం సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరస్పర కోనుగోళ్ల మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను.. ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరి సారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు సిఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇక సాదాబైనామాలకు అనుమతించే ప్రశ్నే లేదని సీఎం స్పష్టం చేశారు. అయితే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇంకా వివాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని సిఎం వివరించారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను ఉచితంగా క్రమబద్దీకరించనున్నట్లు సిఎం కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటీ రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు సిఎం వివరించారు.