కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 5న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘా వద్ద జరిగిన సమావేశం అనంతరం రైతుసంఘాల ప్రతినిధులు ఈ నిర్ణయం ప్రకటించారు.

సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. భేషరతుగా మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి రాతపూర్వకంగా లేఖ రాశారు. చట్టాల్లోని అభ్యంతరాలను కేంద్రానికి సమర్పించారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును సైతం ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 5న గ్రామాల్లో నిరసనలు చేపట్టాలని.. మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. డిమాండ్లు పరిష్కరించకపోతే.. ఢిల్లీలోని అన్ని రోడ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. మరో వైపు మహారాష్ట్ర, గుజరాత్లోని ప్రతి జిల్లాలో గురు, శనివారాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్టు లోక్ సంఘర్ష్ మోర్చ నేత ప్రతిభా షిండే తెలిపారు. చట్టాలను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని, లేకపోతే ఉద్యమం తీవ్రమవుతుందని స్పష్టం చేశారు.