రాష్ట్రంలోని రైతులందరికీ డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా అందరికీ సాయం అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా.. పదిరోజుల్లో రైతులందరికీ డబ్బులు జమ చేయాలని చెప్పారు.

ఈ మేరకు యాసంగి సీజన్ రైతుబంధు సహాయం పంపిణీ విషయమై ప్రగతి భవన్ లో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డిలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.