కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడ నిరాటంకంగా జరుగుతుండడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటి పారుదల శాఖ అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని, ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
దశాబ్దాల గోస తీరింది..
మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని ముఖ్యమంత్రి సందర్శించారు. ముఖ్యమంత్రి సతీమణి శోభ, మంత్రులు,ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను నెమరు వేసున్నారు. సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోసను అనుభవించింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేందుకు అవసరమైన సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్నామని సీఎం అన్నారు.

అంతా అనుకున్నట్టే జరిగింది..
అటు ప్రాణహిత,ఇటు గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తరువాత బ్యారేజి నిర్మాణం చేపడితే ఎక్కువ కాలం పాటు కావలసినంత నీళ్లు పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించామని… వ్యాప్కోస్ తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడిగడ్డ పాయింట్ వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 16.17 టిఎంసీల నీటి నిలువ సామర్ద్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడం వల్ల దాదాపు 7 నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేశాం. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నదని సంతోషం వెలిబుచ్చారు. 99.7 మీటర్ల ఎత్తులో 16.17 టింఎంసీల నీరు నిలువ వున్నది. నిర్మాణాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాయి. నీటి పంపింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతున్నది. మేడిగడ్డ పాయింట్ నుండి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిలువ ఉండడంతో జలకళ ఉట్టి పడుతున్నదని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

నిరంతరం నీటి పంపింగ్..
బ్యారేజీలు సముద్రాలను తలపిస్తున్నాయని.. ఏ సమయం ఎట్ల వచ్చినా మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రతీ ఏటా నీరందుతుందన్నారు. నిజాంసాగర్ కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అవసరమైన పక్షంలో ఎస్సారెస్పీ కూడా ఈ ప్రాజెక్టు నుండే నీటి పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు.

రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయింది..
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చి వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తూపాకుల గూడెం బ్యారేజి, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారెజీ నిర్మాణాలు శరవేగంగా జరగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ తొందరగా పూర్తి చేసి రైతుల సాగునీట గోసను శాశ్వతంగా రూపుమాపలన్నది ప్రభుత్వ లక్ష్యం’’ అని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు.
సాగునీటి సమస్యకు చెక్..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాం. 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కూడా వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమై 365 రోజులు పనిచేశారు. భూసేకరణతో పాటు వివిధ క్రాసింగ్ లకు సంబంధిచిన అంశాలను అధికారులు సమయోచితంగా, సమర్ధంవంతంగా పరిష్కరించారు. మొత్తంగా రాష్ట్ర రైతాంగానికి ఎంతో అవసరమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి వినియోగంలోకి రావడం ఎంతో సంతోషంగా వుందన్నారు సీఎం. తెలంగాణ రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా వుందని ముఖ్యమంత్రి ఆనందాన్ని వ్యక్తపరిచారు. మేడిగడ్డ బ్యారేజీ, తుపాకుల గుడెం బ్యారేజి, దుమ్ముగూడెం బ్యారేజీల వల్ల కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలి. సమయానుగుణంగా రూల్స్ ను అమలు చేయాలి అని ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖాధికారులను ఆదేశించారు.