ఢిల్లీలో సీన్ రోజురోజుకీ హీటెక్కుతోంది. ఆందోళన చేస్తున్న రైతులను బయటకు కూడా పోనివ్వకుండా కట్టడి చేస్తున్నారు. మొన్నటి నుంచి ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు. ఇప్పుడు రైతు సంఘాల నాయకుల ట్విట్టర్ ఖాతాలను కూడా బ్లాక్ చేశారు. కిసాన్ ఏక్తా మోర్చా, బీకేయూ ఏక్తా ఊర్గహాన్ సహా 250 మంది ట్విట్టర్ ఖాతాలను నిలుపివేస్తున్నట్టు ట్విటర్ తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. మరోవైపు, హరియాణ సరిహద్దులోని సింఘు ప్రాంతంలో పోలీసులు భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి, ఢిల్లీ వెళ్లే రోడ్లన్నీ మూసేశారు. దీంతో బయటకు వెళ్లి పనులు చేసుకోడానికి కష్టంగా ఉందని సింఘువాసులు వాపోతున్నారు.
పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, బయటకు కూడా వెళ్లనివ్వకపోవడం, కరెంటు, ఇంటర్నెట్ కట్ చేయడం, వేధింపులకు గురి చేయడం వంటి చర్యలకు నిరసనగా ఈ నెల 6వ తేదీన 3 గంటల పాటు నేషనల్ హైవేస్ ను ముట్టడిస్తామని సంయుక్త ఏక్తా మోర్చా నాయకులు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే మాందసోర్ వద్ద రైళ్లను దిగ్బంధిస్తామని కూడా రైతులు హెచ్చరించారు.