ఢిల్లీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. సింఘూ, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో జన ప్రవాహం మరింత పెరిగింది. ఘాజీపూర్లో రాకేశ్ తికాయత్ నిరసనకు పెద్ద ఎత్తున రైతులు కదిలివస్తున్నారు. దీంతో ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లే జాతీయ రహదారి 24ను పూర్తిగా మూసేశారు. రేపటికి యూపీ, హరియాణ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు చేరుకుంటారని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నారు. ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతుంది, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తప్పక వెళ్తామని చెప్పారు.
సింఘూ సరిహద్దుల దగ్గర పోలీసులు ఎవర్నీ ముందుకి కదలనివ్వడం లేదు. రైతుల దగ్గరకు ఎవరినీ పోనివ్వడం లేదు. రైతులు, ఇతర వాహనాలు.. ఏవీ బయటకు వెళ్లకుండా పది మీటర్ల మేరకు కంటైనర్లు, సిమెంట్ దిమ్మలతో పెద్దపెద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనలు జరుగుతున్న మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. తికాయత్ పిలుపుతో రైతులు ఇంకా కదిలి వస్తూనే ఉన్నారు. “మాకోసం ఇంత మంది ఇక్కడ ఉంటే.. మా నేతలు మా కోసం కన్నీళ్లు పెడుతుంటే మేము రాకుండా ఉండలేకపోయాం” అని అక్కడి వాళ్లు చెప్తున్నారు.