దేశ రాజధానిలో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్న రైతులు కేంద్రంతో చర్చలకు అంగీకారం తెలిపారు. డిసెంబర్ 29న 11 గంటలకు చర్చలకు వస్తామని ప్రకటించారు. 40 రైతు సంఘాల తరపున నాలుగు అంశాల ఎజెండాను కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ కు రైతు సంఘాల సమాఖ్య లేఖ రాసి పంపింది.
లేఖలో తాము సూచించిన అంశాలపై చర్చించడానికి సుముఖంగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంతో మనసుపెట్టి చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయని రైతు సంఘాల సమాఖ్య పేర్కొంది.
ఎజెండాలోని నాలుగు అంశాలివే
1. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చ జరపాలి.
2. అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన ఎంఎస్పీకి చట్ట బద్దత కల్పించాలి.
3. ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్ కు సవరణలు చేయాలి. ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలి.
4. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘విద్యుత్ సవరణ బిల్లు 2020’ ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడంపై చర్చించాలి.