ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు ఈ దేశం భారీ ట్రాక్టర్ ర్యాలీని చూస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. తమ డిమాండ్లు తీరేవరకు రైతులు ఢిల్లీ వదిలి వెళ్లరని.. అవసరమైతే మరో నాలుగేళ్ల వరకు తమ ఆందోళనను పొడిగిస్తారని ఆయన తెలిపారు. శుక్రవారం కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిధ్ధమేనని స్పష్టం చేసిన ఆయన.. కేంద్రప్రభుత్వం, బీజేపీ నేతలు రైతులని టెర్రరిస్టులని వ్యవహరిస్తున్నంత కాలం మా ఆందోళన ఇంకా ఉధృతమవుతుంది అని కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ హెచ్చరించారు.
సుప్రీంకోర్టు ఈ నెల 18 న ఏ ఉత్తర్వులు జారీ చేసినా తాము కూడా అంతే స్థాయిలో స్పందిస్తామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు వెళ్లి మరింతమంది అన్నదాతలను సమీకరిస్తామని, ఈ నెల 23 న అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 26న ఢిల్లీ శివార్లలో మాత్రమే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్వీందర్ సింగ్ ప్రకటించగా రాకేష్ తికాయత్ మాత్రం ఆ రోజున పరేడ్ జరిగే చోటే తాము ఈ ర్యాలీని చేపడతామని ప్రకటించారు. 26న ఢిల్లీలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చూడబోతున్నారని రాకేష్ తికాయత్ అన్నారు.
ఢిల్లీలో 26న భారీ ట్రాక్టర్ ర్యాలీకి.. పిలుపిచ్చిన రైతులు
