తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్లోకి గోదావరి జలాల తరలింపు ప్రకియ కొనసాగుతోంది. దిగువ మానేరుకు గోదావరి జలాలను తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో గత ఆదివారం ఒక్క మోటారుతో నీటిని తరలించగా, తాజాగా పంపు హౌస్లోని 4 భారీ మోటర్లతో 12 వేల 600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు.
నంది రిజర్వాయర్కు చేరుకున్న గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏడవ ప్యాకేజిలోని జంట సొరంగ మార్గాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్కు చేరుతున్నాయి. అక్కడి నుంచి మరో నాలుగు బాహుబలి మోటర్ల ద్వారా వరద కాలువలోకి ఎత్తిపోసి, మిడ్ మానేరు డ్యాం ద్వారా దిగువ మానేరు జలాశయాన్ని గోదావరి జలాలలో నింపుతారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని రామగుండం ఏరియా నీటిపారుదల శాఖ అధికారులు నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరు,ఏడు,ఎనిమిది ప్యాకేజీల ఈఈ నూనె శ్రీధర్ వెల్లడించారు.