వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదుగా వస్తున్న లారీ, ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సంగారెడ్డి దవాఖానకు తరలించగా.. మార్గమధ్యలో మరొకరు మృతిచెందారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా కూలీలుగా గుర్తించారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.

మండలంలోని శంకర్పల్లి వద్ద పత్తి తీసేందుకు చిట్టంపల్లి నుంచి ఆటోలో వెళ్తున్నారు. అయితే మరికొంత మంది కూలీల కోసం ఇజ్రా చిట్టంపల్లి గేట్ వద్ద ఆటో ఆగింది. ఈ క్రమంలో సంగారెడ్డి నుంచి తాండూరు వైపు వెళ్తున్న లారీ.. తాండూరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వచ్చి.. రెండు వాహనాలు ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టాయి. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతులను సోన బాయి (15), సంధ్య (18), నితిన్ (15), శేణీ బాయి (55), రేణుకగా గుర్తించారు.