కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని ఎంత కాలంగా నిరసనలు చేస్తున్నా.. కేంద్రప్రభుత్వం మనసు మారట్లేదని ఆవేదనతో ఓ రైతు.. ప్రధాని తల్లికి భావోద్వేగంతో ఓ లేఖ రాశారు. ఆ చట్టాలను రద్దు చేసేలా మీ అబ్బాయి మనసు మీరైనా మార్చండి అంటూ ఆ లేఖలో రైతు కోరారు.
పంజాబ్ కు చెందిన హర్ప్రీత్ సింగ్ అనే రైతు మోదీ తల్లి హీరాబెన్కు ఓ లేఖ రాశారు. అందులో కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు రద్దు చేయాలో ఆ రైతు వివరించారు. తాము ఎందుకు ఆందోళనలు చేస్తున్నామో చెప్పారు. అందులో “చాలా బరువైన హృదయంతో ఈ లేఖ రాస్తున్నాను. దేశం కడుపు నింపే రైతులను ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ రోడ్లపై పడుకునేలా చేస్తున్నారు. ఈ ఆందోళనలో 90 ఏళ్ల వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది చనిపోయారు. కార్పొరేట్లకు మేలు చేసేలా ఈ చట్టాలను రూపొందించారు. ఎన్నో ఆశలతో ఈ లేఖ రాస్తున్నాను. మీ అబ్బాయి నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధాని. ఆయన ఈ చట్టాలను రద్దు చేయగలరు. తల్లి మాటను ఎవరూ కాదనరు.” అని ఆ రైతు లేఖలో రాశారు.
