ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. అభివృద్ధి బూచీగా పదవులను అమ్ముకోవడం ప్రజాస్వామ్యంలో అలవాటుగా మారింది. పదవులను వేలం వేసి కోట్ల రూపాయలు జమ చేసి.. అభివృద్ధి కోసం అంటూ నయా వ్యాపారానికి తెర తీస్తున్నారు కొంతమంది. గ్రామ సర్పంచ్ పదవిని ఓ పెద్దాయన ఏకంగా రూ.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని 36 జిల్లాలకు గాను 34 జిల్లాల్లోని 14,234 గ్రామపంచాయతీలకు జనవరి 15 న ఎన్నికలు జరిపేందుకు మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. గ్రామపంచాయతీలను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే, గ్రామాల్లో కొందరు సర్పంచ్ పదవులను బేరానికి పెడుతున్నారు. రూ.25 నుంచి రూ.50 వేల వరకు డెవలప్మెంట్ ఫండ్కు నిధులు ఇచ్చి.. సర్పంచ్ పదవిని దక్కించుకున్న ఘటనలు చాలా జరిగాయి. అయితే.. నాసిక్ జిల్లాలో దేవ్లాలీ తాలూకాలోని ఉమ్రానే అనే గ్రామంలో ఓ పెద్దాయన మాత్రం ఏకంగా రూ.2.05 కోట్లు చెల్లించి సర్పంచ్ పదవిని ఎగురేసుకుపోయాడు. రూ. కోటితో ప్రారంభమైన సర్పంచ్ పదవి వేలం రెట్టింపు మొత్తంతో ముగిసి విశ్వాస్రావు దేవరే అనే వ్యక్తికి దక్కింది. నిజానికి సర్పంచ్ పదవిని ఆక్షన్ పెట్టాలన్న ఆలోచన గ్రామపెద్దలకు తొలుత లేదు. అయితే, పోటీ ఎక్కువగా ఉండటంతో గ్రామంలో ఆలయం నిర్మించడంతోపాటు దాని ఆలనాపాలనా చూసేందుకు సర్పంచ్ పదవిని ఆక్షన్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.