ఆమె పేరు గుర్లీన్ చావ్లా.. కానీ ఇప్పుడు అందరూ ఆమెను స్ట్రాబెరి గర్ల్ అంటున్నారు. రీసెంట్ గా మన్ కీ బాత్లో ప్రధాని మోదీ కూడా ఈమె గురించి మాట్లాడారు. గుర్లీన్ చావ్లా.. బుందేల్ఖండ్ ఆశాజ్యోతి అన్నారు. ఇంతకీ ఎవరీ గుర్లీన్.. ఈమె స్ట్రాబెరీ గర్ల్ గా ఎలా మారింది.
ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్లో ఉష్ణోగ్రత ఎక్కువ. వానలు, నీటివసతి తక్కువ. అందుకే అక్కడ వ్యవసాయం చాలాకష్టంగా ఉంటుంది. అయితే లా చదువుతున్న 23 ఏళ్ల గుర్లిన్ లాక్డౌన్లో బుందేల్ ఖండ్ వచ్చింది. వచ్చి ఊరికే ఉండకుండా తండ్రి పొలంలో స్ట్రాబెర్రీ వేసింది. విజయవంతంగా పండించింది. రైతులకు స్ట్రాబెరీ ఎలా పండించాలో చెప్పింది. అంతే “స్ట్రాబెర్రీ గర్ల్”గా ఫేమస్ అయ్యింది.
మామూలుగా స్ట్రాబెర్రీ 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర పండదు. నీటి వసతి కచ్చితంగా ఉండాలి. అయితే బుందేల్ఖండ్లో ఉష్ణోగ్రత ఎక్కువే.. పైగా నీటి కొరత.. అయినా సరే.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని గుర్లిన్ స్ట్రాబెరీ పండించి సక్సెస్ అయింది.
లాక్డౌన్ లో మొదలుపెట్టి..
పూనెలో లా చదువుతున్న గుర్లిన్.. లాక్డౌన్లో కాలేజీ మూతపడటంతో ఇంటికి చేరుకుంది. ఇంట్లో తండ్రి టెర్రస్ మీద ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించడం గమనించి తానూ తోటపనిలో పడింది. రసాయనాలు లేని తాజా కూరగాయలు ఎలా పండించాలో తెలుసుకుంది. ఒకరోజు 20 స్ట్రాబెర్రీ మొలకలను తెచ్చి తన ఇంటి డాబా మీద ఉన్న తోటలో నాటింది. వాళ్ల నాన్నతో సహా చాలామంది “ఇవి బతకవు” అని చెప్పారు. కాని ఆ మొక్కలు బతికాయి. ఇంకా ఆశ్చర్యంగా కాయలు కూడా కాశాయి. వీటిని పొలంలో ఎందుకు పండించకూడదు అనుకుంది. తండ్రితో పోరు పెట్టుకుని మరీ పొలంలో పండిస్తానని మొండికేసింది. గుర్లిన్ తండ్రికి నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. ఎలాగూ ఖాలీగా ఉంది కదా అని.. గుర్లిన్ ఉత్సాహం చూసి సరే అన్నాడు. అంతే లాక్ డౌన్ టైంను సరిగ్గా ఉపయోగించుకుని 2020 అక్టోబర్లో సేంద్రియ పద్ధతి ద్వారా ఒకటిన్నర ఎకరాలో స్ట్రాబెర్రీ పంట వేసింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి రైతులు కూడా ఈ పంట ఎలా పండుతుంది అని ఆశ్చర్యపోయారు.
స్టాబెరీ అంబాసిడర్
అలా జనవరి నెల వచ్చేసరికి స్ట్రాబెర్రీని పంట చేతికొచ్చింది. “ఈ సీజన్లో పది వేల కిలోల దిగుబడిని ఆశిస్తున్నాను. మార్కెట్లో కిలో 250 రూపాయలకు అమ్ముతున్నాను. రైతులు ఒక పంట ఒకే పద్ధతిలో కాకుండా భిన్నంగా ఆలోచిస్తే విజయాలు సాధించవచ్చు” అని గుర్లిన్ అంటోంది. జనవరి 16 నుంచి బుందేల్ ఖండ్ లోని ఝాన్సీలో “స్ట్రాబెర్రీ ఫెస్టివల్” జరుగుతోంది. బుందేల్ఖండ్ ప్రాంతంలో స్ట్రాబెర్రీని ప్రోత్సహించడం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గుర్లిన్ను ‘స్ట్రాబెర్రీ అంబాసిడర్’గా ప్రకటించారు. అంతే కాదు, ప్రధాని మోడి తన మన్ కీ బాత్లో కూడా గుర్లిన్ను ప్రస్తావించారు. అలా గుర్లిన్ స్ట్రాబెరీ గర్ల్ గా ఫేమస్ అయింది.