కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్లో ఛేదించే క్రమంలో కేకేఆర్ పూర్తిగా తేలిపోయింది. శుబ్మన్ గిల్ మినహా ఎవరూ రాణించలేదు. కేకేఆర్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు దేవదూత్ పడిక్కల్, అరోన్ ఫించ్లు మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్కు 67 పరుగులు జోడించారు. పడిక్కల్ ఔటైన తర్వాత ఫించ్కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ స్టైక్ రొటేట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఫించ్ పెవిలియన్ చేరాడు. ఫించ్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన డివిలియర్స్.. విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ ల తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అటు డివిలియర్స్ కు అండగా ఉన్న కోహ్లీ.. 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో రసెల్, ప్రసిద్ధ్ కృష్ణలకు తలో వికెట్ లభించింది.
195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఏ దశలోనూ బెంగళూరుకు పోటీ ఇవ్వలేకపోయింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ 34 పరుగులతో రాణించగా.. కెప్టెన్ దినేశ్ కార్తీక్తో సహా మిగతా బ్యాట్స్ మెన్ అంతా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరీస్ చెరో రెండు వికెట్లు తీశారు.
సూపర్ హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించిన ఏబీ డివిలియర్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో రెండు పాయింట్లు సాధించిన కోహ్లీ సేన.. ఓవరాల్ గా పది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.