చెన్నై సూపర్ కింగ్స్ సంచలన ప్రదర్శన చేసింది. వరుస ఓటములతో డీలా పడ్డ ధోనీ సేన.. మళ్లీ టచ్ లోకి వచ్చింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. దీంతో పంజాబ్ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పంజాబ్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్కు 61 పరుగులు జత చేశారు. పీయూష్ చావ్లా బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన మన్దీప్ సింగ్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అయితే 94 పరుగుల వద్ద ఉండగా మన్దీప్ సింగ్ను జడేజా ఔట్ చేశాడు. ఆతర్వాత పూరన్-రాహుల్ జోడి మూడో వికెట్కు 58 పరుగుల జత చేసింది. 18 ఓవర్ తొలి బంతికి పూరన్ ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్..ఆ మరుసటి బంతికి రాహుల్ను పెవీలియన్ చేర్చాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు మందగించింది. చివర్లో వచ్చిన మ్యాక్స్వెల్, సర్పరాజ్ ఖాన్ లు స్థాయికి తగ్గట్లు ఆడకపోవడంతో.. పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా తలో వికెట్ తీశారు.
ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఈజీగా టార్గెట్ ను ఛేజ్ చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ ఫామ్లోకి రావడంతో పాటు మరో ఓపెనర్ డుప్లెసిస్ సూపర్ ఫాంను కొనసాగించడంతో చెన్నై 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వాట్సన్, డుప్లెసిస్ ధాటికి పంజాబ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వాట్సన్ 53 బంతుల్లోనే 83 పరుగులు చేయగా..డుప్లెసిస్ 53 బంతుల్లో 87 పరుగులతో సత్తాచాటాడు. వీరిద్దరు పోటీపడుతూ..బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించడంతో.. 17.4 ఓవర్లలోనే చెన్నై లక్ష్యాన్ని చేరుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.
సూపర్ ఫర్మామెన్స్ తో జట్టును గెలిపించిన షేన్ వాట్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ నెల 7న కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.