రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక చెరువులు అలుగుపోస్తున్నాయి. కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. తగు సూచనలు చేశారు…. స్పాట్
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో రెండు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని స్థానిక కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని ఫలితంగా కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని, వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నం కావచ్చని సీఎం చెప్పారు.
అటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని దాదాపు అన్ని చెరువులు అలుగుపోస్తున్నాయని చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రెండు హెలికాఫ్టర్లను సిద్ధంగా ఉంచింది. వరదల వల్ల చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాఫ్టర్ తో పాటు సైనిక హెలికాఫ్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించి గోదావరి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.వరంగల్ కు జాతీయ విపత్తుల నివారణ బృందాలను రప్పించారు.వరంగల్ రూరల్,అర్బన్ జిల్లాలతోపాటు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లు,ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.అటు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, వరదలపై జిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం జరుగకుండా చూడాలని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షించడానికి కలెక్టర్లు తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలోనూ కంట్రోల్ రూం ఏర్పా టైందని, ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా 040-23450624 కు ఫోన్ చేయాలని సీఎస్ చెప్పారు.