ఇదిగో ఈ ఫోటో చూడండి.. ఎంత చక్కని ఉపాయం కదూ.. పనికిరాని డబ్బాతో తయారు చేసినది. పక్షులకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఒకేచోట ఏర్పాటు చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇది తయారు చేసిన పక్షి ప్రేమికుడు ఎవరోగానీ అతనికి సలాం చేయాలి. ఎందుకుంటే.. ఎండలు మండిపోతున్నాయి. మనుషులకే ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఇక పక్షుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆహారం, నీటికోసం ఎండలో ఎంతో దూరం ప్రయాణిస్తే తప్ప అవి బతికే పరిస్థితి లేదు. ఎండాకాలం తిండికి, తాగునీటికి పక్షులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కనీసం తాగటానికి నీళ్లు దొరక్క పెద్దసంఖ్యంలో చనిపోతుంటాయ్.
పక్షులు పర్యావరణ సమతుల్యతకు ఎంతో దోహదపడుతాయి. ఒకప్పుడు పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా పక్షుల సందడి కనిపించేది. రానురాను వాటి ఉనికి అంతరించి పోయింది. పట్టణాల్లో అసలు పక్షుల జాడే లేదు. పక్షులు అంటే ఇలా ఉంటాయని టీవీలు, కంపూటర్లు, సెల్ఫోన్లలో మనపిల్లలకు చూపించాల్సిన దుస్థితి ఏర్పడింది. పక్షులను ప్రత్యక్షంగా చూడాలంటే అడవులకు వెళ్లాల్సిన అవసరమొచ్చింది.
పర్యావరణాన్ని పట్టించుకోక పోతే, ఎన్నో అనర్థాలను మనకు మనంగా తెచ్చుకున్నట్లే. మనుషులు చేసే కొన్ని పనుల వల్ల ఎన్నో రకాల పక్షులు, జంతువులు నేడు అత్యంత ప్రమాదంలో పడ్డాయి. పక్షులను, పర్యావరణాన్ని కాపాడటానికి మన వంతు ప్రయత్నం చేయాలి. సో.. మీ ఇంటి ముందో, ఆరుబయటో, మీ పొలం వద్దనో, ఏ చెట్టుకో, తీగకో పక్షులకోసం పాత రేకు డబ్బాతో పైన ఫొటోలోలాగ ఓ తయారు చేసి పక్షుల ప్రాణాలు కాపాడండి. ప్రకృతిని కాపాడినవారవుతారు. పకృతి వైపరీత్యాల వల్ల సంభవించే దుష్పరిణామాల నుండి మనల్ని మనం కాపాడుకున్నవారవుతాము.