- సారు మాటే తమదనీ.. సాగుతూ చూపిస్తామని!
- ఊరెనక ఊరు కదిలింది ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేసింది
- నియంత్రిత సాగుకు 75 గ్రామాల మద్దతు
- సిద్దిపేటలో సంచలనం
- స్ఫూర్తిగా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక
- గజ్వేల్లోనే 60 ఊర్ల తీర్మానం
- దత్తత గ్రామం ఎర్రవల్లిదీ సీఎం మాటే
భవిష్యత్తు వట వృక్షమూ చిన్ని బీజంలోనే ఇమిడి ఉంటుంది.
భారీ దిగుబడీ కొన్ని విత్తన గింజల్లోనే ఒదిగి ఉంటుంది.
వచ్చే పెను మార్పు కూడా తొలి అడుగులోనే దాగి ఉంటుంది.
ప్రేరణగా నిలిచే చిరు చలనమే సంచలనానికి దారితీస్తుంది.
తెలంగాణలో ఇప్పుడు అలాంటి సంచలనమే చోటు చేసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన నియంత్రిత సాగు విధానానికి తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో మద్దతు పలుకుతున్నది. సారు మాట వింటామని, సాగుబాటు మారుస్తామని రాష్ట్రవ్యాప్తంగా వందల పల్లెలు ఎక్కడికక్కడ ఒక్కుమ్మడిగా తీర్మానాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వస్థలం ఉమ్మడి మెదక్, అందునా సిద్దిపేట జిల్లాలో ఊర్లకు ఊర్లు ఉత్సాహంతో కదులుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 75 గ్రామాల్లో రైతులు నియంత్రిత సాగు విధానం పాటిస్తామంటూ ప్రతిజ్ఞలు చేశారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామం ఎర్రవల్లి కూడా ఇందులో ఉన్నది.
తెలంగాణ రైతాంగం సరికొత్త సాగు పద్ధతికి మారాల్సిన తరుణం ఆసన్నమైందంటూ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన ప్రతిపాదనపై జిల్లా రైతుల్లో పెద్దఎత్తున చర్చ సాగుతున్నది. మంత్రి హరీశ్రావు జిల్లాలో పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం ఊరువెనక ఊరు కదిలింది. రైతులు ఎవరికి వారే నాయకులుగా మారి, గ్రామాల వారీగా స్వచ్ఛందంగా సదస్సులు ఏర్పాటు చేసుకున్నారు. కొత్త పద్ధతిని ఆహ్వానిస్తూ తీర్మానాలు చేశారు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక తదితర నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పల్లెలు నియంత్రిత సాగుకు ముందుకువచ్చాయి. ప్రభుత్వం సూచించిన పంటలే వేస్తామని రైతులు ప్రమాణపత్రం సాక్షిగా మాట ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయరంగంలో రానున్న భారీ మార్పునకు ఇది తొలి అడుగు. రైతాంగ సాధికారతా విప్లవానికి రైతులే వేసుకుంటున్న పునాది ఇది.