వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్.. నల్లగొండ-వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించేలా మంత్రి కేటీఆర్ పకడ్బందీ వ్యూహం రచించారు. అక్టోబర్ ఒకటి నుంచి 45 రోజులపాటు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నారు. ఈ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, బీజేపీ నేత ఎన్ రాంచందర్రావు పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఇప్పటికే ఆరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశమైన కేటీఆర్.. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వార్డుస్థాయి నుంచి టీఆర్ఎస్కు ఉన్న నెట్ వర్క్ తో పార్టీ అభ్యర్థుల గెలుపు తథ్యమని నేతలను ఉత్సాహ పరుస్తున్నారు. గ్రామస్థాయి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని, నియోజకవర్గాలవారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఓటరు నమోదుపై అవగాహన తీసుకు రావాలని సూచించారు. ఉమ్మడి ఆరు జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించేలా కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే రెండు స్థానాల్లోని పార్టీ ఎన్నికల ఇంచార్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యులు తదితర నాయకులతో మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇకనుంచి తరచుగా వీరితో వీడియో, టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహించనున్నారు. కేటీఆర్ ఆదేశాలతో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల నియోజకవర్గాల వారీగా నియమించిన ఓటరు నమోదు ఇంచార్జిలు తమ పనులు మొదలుపెట్టారు.
వరంగల్-నల్లగొండ- ఖమ్మం పట్టభద్రుల స్థానంలో మొదటి నుంచి టీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టగా నాలుగోసారీ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అభివృద్ధి ఎజెండా, 1.5 లక్షల ఉద్యోగాల భర్తీ, మరో 15 లక్షల మందికి ఉపాధి కల్పించిన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కేటీఆర్ ప్రణాళిక రచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగునీటి రంగం, పంటల కొనుగోలు, ఇంటింటికి తాగునీరు, కొత్త మండలాలు, జిల్లాల ఏర్పాటుతో పాటు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం, పచ్చగా మారిన పాలమూరు.. తదితర విజయాల్లో టీఆర్ఎస్ పాత్రను వివరించనున్నారు. మొత్తంగా పార్టీ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు.