హైదరాబాద్ వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూసి చలించిపోయా. లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి చాలా బాధపడ్డానని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని తెలిపారు. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం అందని అందరికి తిరిగి సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ ప్రజలకు హామీ ఇస్తున్నా.. మరో రూ.300 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడదు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం అందిస్తాం. ప్రధానిని రూ.1300 కోట్ల సాయం అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదు. మేం భారతదేశంలో లేమా. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకు సాయం ఇవ్వలేదా’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

‘వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతానా? అని కేసీఆర్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. వరదసాయం చేయాలని ఎవరూ అడగకపోయినా.. వరదలు వచ్చిన ఏ నగరంలోనూ ప్రభుత్వాలు సాయం చేయకపోయినా.. నగర ప్రజలకు అండగా ఉండడం కోసం ముఖ్యమంత్రిగా సాయం చేస్తుంటే.. కొందరు కిరికిరి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశార. ఏ నగరంలోనూ ఇవ్వని విధంగా 6.5లక్షల మందికి 650 కోట్లు ఇచ్చాం. ఈసీకి కంప్లైంట్ చేసి కొందరు వరదసాయం బంద్ చేయించారు. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్లోనూ వరదలు వచ్చాయి. మంత్రులంతా మోకాళ్లలోతు నీళ్లలో తిరిగారు. కొందరి కోసం పనిచేసి అందరినీ ఆగం చేయం అన్నారు కేసీఆర్. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ..సంక్షేమ పథకాలు ఆపలేదని.. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉంటుందని సీఎం గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలో ఆరేళ్లుగా రాజీపడలేదు. రౌడీమూకలను అణచివేశాం. హైదరాబాద్లో ఉన్న సీసీ కెమెరాలు దేశంలో ఎక్కడా లేవని’ సీఎం పేర్కొన్నారు.