వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశంలో వ్యసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో సీఎం చర్చిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల అంశంపై హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి ఇంకా అందలేదు. హైకోర్టు కాపీ అందిన తర్వాత ఈ అంశంపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా? లేక దానికి అనుగుణంగా విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు.