షీ టీమ్స్ తో పాటు సంఘమిత్ర కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అలాగే ‘సంఘమిత్ర’ కార్యక్రమాన్ని తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతానన్నారు. శనివారం నాగోల్లో రాచకొండ పోలీసులు, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సంఘమిత్ర సర్టిఫికేషన్ కార్యక్రమంలో సీపీ మహేశ్ భగవత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమైనప్పుడే చట్టాలు పూర్తిస్థాయిలో అమలవుతాయని, అప్పుడే ఆడపిల్లలపై అఘాయిత్యాలు తగ్గుతాయన్నారు. కేసీఆర్ మానస పుత్రిక అయిన ‘షీ టీమ్స్’ స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లోనూ షీ టీమ్స్ ఏర్పాటు చేశారని కవిత గుర్తుచేశారు. తర్వాత రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సంఘమిత్రలకు సర్టిఫికెట్స్ అందజేశారు.