రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పిల్లలకోసం ఎంత చేసినా తక్కువేనన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే తనను ఇంతటివాడిని చేసిందని వెల్లడించారు.
సిరిసిల్ల పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ స్థాయిలో స్కూల్ బిల్డింగ్ను నిర్మించడంతో రాష్ట్రంలో సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.

రాష్ట్రంలో 945 గురుకులాలను ఏర్పాటు చేశామని, ఒక్కో విద్యార్థికి రూ.1.25 లక్షలు ఖర్చుచేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.29 లక్షల విద్యా రుణం ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు. ఉద్యోగం కోసమే చదువుకోకుండా.. విద్యా విజ్ఞానాన్ని నేర్చుకునేలా విద్యార్థులు తయారు కావాలన్నారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని కేటీఆర్ విద్యార్థులకు సూచించారు.
1960లో ఏర్పాటైన ఈ పాఠశాల ఎంతో మందిని ప్రయోజకులను చేసిందని, పలు సేవా సంస్థల సహకారంతో కరోనా సమయంలో ఈ పాఠశాల పునర్నిర్మించామని గుర్తుచేశారు. ఒకేసారి నాలుగు వందల మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, 39 తరగతి గదులతో భవనాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.