తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక పట్ల సర్వత్రా ఉత్కంఠ వీడలేదు. ఇందుకు గానూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ నాలుగు రోజుల పాటు తెలంగాణలో ఉండి.. అభిప్రాయ సేకరణ జరిపారు. ఆ నివేదికను హైకమాండ్ కు పంపించారు. ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలవడం ఆసక్తికరంగా మారింది.
ఈ పదవి రేసులో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు రేసులో ఉన్నారు. మరోవైపు యువ నేతలు సైతం పోటీ పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోనియా గాంధీని కలిశారు. టీపీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని, తనకు అన్ని అర్హతలు ఉన్నాయని సోనియా గాంధీని కోరారు. కోమటిరెడ్డితో పాటు అనేక మంది నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఎవరికి ఆ పదవిని అప్పగిస్తారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. టీపీసీసీ చీఫ్ పదవి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అధిష్టానం ఎవరు పేరు ప్రకటిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.