డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్లలో మునిగిపోతామంటే ఈ ఏడాది కుదరదంటున్నారు నగర పోలీసులు. ఈవెంట్లతో పాటు అన్ని హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లు అన్నింటి పైనా నిఘా పెట్టారు. సైబరాబాద్ పరిధిలో కొత్త ఏడాది వేడుకలపై ఆంక్షలు విధించారు. అనుమతిచ్చిన సమయం వరకే పబ్బులు, రెస్టారెంట్లు నడపాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. రిసార్ట్స్, పబ్బులు, స్టార్ హోటళ్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఫంక్షన్ హాళ్లు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లలోనూ వేడుకలకు అనుమతిలేదని చెప్పారు.
డిసెంబర్ 31న స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని ప్రకటించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కొవిడ్ నేపథ్యంలో వేడుకలకు అనుమతులు లేవని తెలిపారు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్లు, పబ్లు, ఈవెంట్ల పేరిట సింగర్స్, డ్యాన్సర్లకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా ఈవెంట్ల పేరిట టికెట్లు విక్రయించినా, ఆన్లైన్లో పెట్టినా డయల్ 100, వాట్సాప్ కాల్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొత్త కరోనా హడలెత్తిస్తోన్న సమయంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో అధిక సంఖ్యలో జనం ఒక్కచోటికి రావడం వల్ల వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు.