సింగరేణి బొగ్గు మరోసారి ఉద్యోగాల గనిగా మారబోతున్నది. రానున్న ఆరు నెలల్లో సంస్థలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. గత ఐదేండ్లలో ప్రత్యక్ష, కారుణ్య, అంతర్గత నియామకాల పద్ధతుల్లో 16 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోస్టుల్లో ఇంటర్నల్ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు.
సింగరేణి భవన్లో నిన్న జరిగిన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. పలు గనుల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ సిబ్బంది, సూపర్ వైజర్లు, మెడికల్ సిబ్బంది, స్పెషలిస్టు డాక్టర్లు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉత్పత్తి పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనిపై స్పందించిన ఎండీ శ్రీధర్ సంస్థలో ఖాళీగా ఉద్యోగాలన్నింటినీ ఆరు నెలల్లోగా భర్తీచేస్తామని చెప్పారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్మికుల రక్షణ విషయంలో పరికరాల కొనుగోలుకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.