టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండేండ్లు పూర్తయినయి. తొలి విడత నాలుగున్నరేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జనరంజక పాలన అందించిన టీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి కూడా ప్రజల అభిమానాన్ని చూరగొంది. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, కలల్ని నిజం చేస్తూ టీఆర్ఎస్ 2.0 ప్రభుత్వంలో సంక్షేమం రెండింతలయింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాల అమలును ఆపలేదు. దీనికి తోడు.. ప్రజలు ఇబ్బందులు పడకుండా కరువు సాయం, ఉచిత బియ్యం పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలబడింది.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సర్కారు చేపట్టిన సంస్కరణలు రాష్ట్రంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రతిరంగంలో అద్భుతమైన ప్రగతి కనబరుస్తూ.. అభివృద్ధి మైలురాళ్లు నాటుతూ ముందుకు సాగింది. వ్యవసాయంలో నియంత్రిత సాగు, నూతన రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్, పారదర్శకంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం, జిల్లాల్లో ఐటీ వెలుగులు, ఆర్టీసీలో కార్గో సేవలు, మిషన్ భగీరథతో 95శాతం ఇండ్లకు తాగునీటి సరఫరా వంటి ఎన్నో అభివృద్ధి పనులు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి.
దీనికి తోడు రాష్ట్రంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కింది. హైదరాబాద్ కేంద్రంగా దేశంలోనే టాప్లో ఉన్న ఐటీ సెక్టార్ ను జిల్లాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది. దీంతో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు పల్లెల బాట పట్టాయి. హైదరాబాద్ తర్వాత వరంగల్లో ఐటీ విస్తరించగా.. తాజాగా ఖమ్మంలోనూ ఐటీ రంగం అడుగు పెట్టింది. మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సైతం ఐటీ టవర్ల నిర్మాణం శరవేగంగా పూర్తవుతున్నది. తాజాగా సిద్దిపేట జిల్లాలోనూ సీఎం కేసీఆర్ ఐటీ టవర్కు బీజం వేశారు.
మరోవైపు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు జాతీయ సగటును మించాయి. కరోనా సమయంలో జాతీయస్థాయిలో ఐటీ వృద్ధిరేటు 8.09 శాతం ఉండగా, తెలంగాణలో 17 శాతం నమోదైంది. లుక్ ఈస్ట్ విధానాన్ని అమలు చేస్తుండటంతో హైదరాబాద్ నలువైపులా ఐటీ విస్తరిస్తున్నది. కాగా, అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తుండటం విశేషం.