తెలంగాణ ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే కార్గో, పార్సిల్ సేవలను అందిస్తూ వినియోగదారులకు దగ్గరైన ఆర్టీసీ.. ఇకనుంచి ఇంటింటికీ పార్సిళ్లను అందించనుంది. మొదట ఈ సేవలు హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్లోని రవాణాశాఖభవన్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హోం డెలివరీ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. కార్గో, పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీ ప్రజల ఆదరణ చూరగొంటున్నదని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రస్తుతం సంస్థ రోజుకు రూ.15 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నదని, త్వరలోనే రూ.25 లక్షల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జూన్ 19న ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించగా అప్పటి నుంచి ఇప్పటిదాకా 12.50 లక్షల పార్సిళ్లను చేరవేసి రూ.11.30 కోట్ల ఆదాయం ఆర్జించిందని, ఆర్టీసీ చరిత్రలో ఇదో గొప్ప మైలురాయి అని ఆయన చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి సంస్థ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నదని, ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) కూడా క్రమంగా పెరుగుతోందన్నారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని, బడ్జెట్లో కేటాయించిన రూ.వెయ్యి కోట్ల కంటే ఎక్కువే విడుదల చేస్తున్నదని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, సిబ్బంది ఉద్యోగ భద్రతపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని వెల్లడించారు. దృష్టిసారించారని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 147 బస్ స్టేషన్లలో కార్గో, పార్సిల్ సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తం 610 మంది ఏజెంట్లు సేవలు అందిస్తున్నారు. 150 వాహనాలు కార్గో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా మారాయి. మరో 28 మినీ కార్గో బస్సులు కూడా సేవలు అందిస్తున్నాయి. టీఎస్ ఫుడ్స్, హర్టీకల్చర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, టీఎస్పుస్తకాలు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, సివిల్ సప్లయ్, ఫెర్టిలైజర్స్, తదితర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కార్గో సేవలు అందిస్తున్నారు. తాజాగా ఇప్పుడు డోర్ టు డోర్ సేవలు కూడా వినియోగంలోకి వచ్చాయి.